పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది: బాలకృష్ణ
- ఏపీఎఫ్డీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం
- ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ
- తెలుగు సినిమాలకు వస్తున్న ఆదాయంలో 70 శాతం ఏపీ నుంచే వస్తోందన్న బాలయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీని తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విభజన తర్వాత 2017లో ఏపీలో ప్రత్యేకంగా ఏర్పాటయిందని గుర్తుచేస్తూ.. ఇది ఇండస్ట్రీ అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి తామంతా టాలీవుడ్ పురోగతి కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు సినిమాలకు వస్తున్న మొత్తం కలెక్షన్లలో సుమారు 70 శాతం ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఏపీలో అద్భుతమైన సహజ సిద్ధమైన లొకేషన్లు ఉన్నాయని, తాను నటించిన ‘అఖండ’ సినిమా షూటింగ్ను కూడా రంపచోడవరంలోనే జరిపినట్లు ప్రస్తావించారు. "నేను చేసినన్ని సినిమాలు ఏపీలో బహుశా మరెవ్వరూ చేసి ఉండరు" అని చెప్పారు. షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టెక్నాలజీ లేనప్పుడే సినిమాలు త్వరగా పూర్తయ్యేవని, ఇప్పుడు సాంకేతికత పెరిగినప్పటికీ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందన్నారు. షూటింగ్లు తగ్గిపోవడంతో అనేక సినీ యూనియన్లు పనులు లేక ఇబ్బందులు పడుతున్నాయని, చాలామంది పంపిణీదారులు థియేటర్లకు తాళాలు వేసుకునే దారుణమైన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకప్పుడు సినిమా ఎలా ఉండాలో ఆలోచించేవాళ్లం, కానీ ఇప్పుడు పరిశ్రమను బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చింది" అని వ్యాఖ్యానించారు. నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీసి థియేటర్లను బ్రతికించాలని పిలుపునిచ్చారు.